- మహేష్బాబు సినిమా సెట్టింగ్ బుగ్గిపాలు
- మోహన్బాబు స్కూల్పై దాడి
- పవన్కళ్యాణ్ గెస్ట్హౌజ్ ధ్వంసం
- ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పేర్లు తొలగింపు
- పలువురు నేతల రాజీనామా
ప్రత్యేక తెలంగాణా విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణా జిల్లాల్లో చేపట్టిన బంద్లో భాగంగా గురువారం కూడా సినీరంగంపై దాడులు కొనసాగాయి. రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరిపల్లి సమీపంలో మహేశ్బాబు, అనుష్క జంటగా నటిస్తున్న 'కిలాడి' సినిమా సెట్టింగ్కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కోటి రూపాయల విలువ చేసే సామాగ్రి బుగ్గిపాలైనట్లు నిర్వహకులు తెలిపారు. అక్కడే ఉన్న సుమోకు, రెండు డిసిఎంలకు నిప్పు పెట్టారు. ఘట్కేసర్ మండల పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లోని సినీనటుడు మోహన్బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ పాఠశాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సినీనటుడు పవన్కళ్యాణ్కు చెందిన గెస్ట్హౌజ్ అద్దాలు పగులగొట్టారు. ఎంపి కావూరి సుబ్బారావుకు చెందిన ఫాంహౌజ్పై దాడి చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జనహర్ష రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. గురువారం ధర్నాలు, రాస్తారోకోలతో జనజీవనాన్ని స్తంభింపజేశారు. పలు చోట్ల వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. బ్యాంకుల, హోటళ్లకు ఆంధ్రా పేర్లు తొలగించారు. వికారాబాద్లో సినిమా హాళ్లపై రాళ్లు రువ్వారు. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్ రైలును అడ్డుకున్నారు. అవుషాపూర్లోని శ్రీనిధి రిసార్ట్స్లోని ఇండోర్ గ్రౌండ్కు నిప్పంటించారు. తాండూరులో పది లారీలు, ఒక బస్సు, పలు షాపుల అద్దాలు పగులగొట్టారు. రైల్వే బుకింగ్ కౌంటర్ అద్దాలు ధ్వంసం చేశారు. రైలు పట్టాలకు అడ్డంగా ఇనుప స్తంభాలు వేశారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ కార్యాలయాల పేర్లు తొలగించారు.
No comments: